హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్కు ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు మూసీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతానికి గేట్లు తెరిచేంత ప్రమాదం లేదని, ఒకవేళ పరిస్థితిని బట్టి గేట్లు ఎత్తివేయాల్సి వస్తే ఆ సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.
ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం జలాశయాల్లోకి సుమారు 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
ఉస్మాన్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం (FTL) 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,784.30 అడుగుల వద్ద నీరు ఉంది. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1,760.60 అడుగుల వద్ద కొనసాగుతోంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్, హైడ్రా విభాగాలను అప్రమత్తం చేశారు.


