శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్ ‘ఏ’, శ్రీలంక ‘ఏ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం శ్రీలంక ఆటగాళ్లు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీతో వాగ్వాదానికి దిగడం వివాదాస్పదంగా మారింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ను సూపర్ ఓవర్లో శ్రీలంక ‘ఏ’ జట్టు గెలుచుకుంది.
మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంక ‘ఏ’ ఆటగాడు విషెన్ హలంబగే, భారత యువ ఆటగాడు 15 ఏళ్ల సూర్యవంశీ వద్దకు వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. “ఇక మ్యాచ్ అయిపోయింది.. నువ్వు ఇంటికి వెళ్లు..” అంటూ హలంబగే అనడంతో సూర్యవంశీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అంపైర్లు, ఇతర అధికారులు, సీనియర్ ఆటగాళ్లు కల్పించుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటనపై శ్రీలంక ‘ఏ’ డ్రెస్సింగ్ రూమ్లో తీవ్రమైన చర్చ జరిగినట్లు సమాచారం. మైదానంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, ముఖ్యంగా తగినంత వెలుతురు లేకపోయినా సూపర్ ఓవర్ ఆడిన నేపథ్యంలో భారత జట్టుకు క్షమాపణ చెప్పాలని జట్టులోని కొందరు సభ్యులు కూడా సూచించినట్లు తెలుస్తోంది.


