నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్రం విధించిన ఆంక్షలపై విచారణ ముగింపు..
న్యూఢిల్లీ: మెసేజింగ్ ప్లాట్ఫామ్ Telegram సేవలను దేశవ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సమాచార సాంకేతిక చట్టం-2000లోని సెక్షన్ 69A కింద జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
జూన్ 21న జరగనున్న నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామినేషన్ దృష్ట్యా జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ సేవలను నిలిపివేయడంతో పాటు, జూన్ 30 వరకు మెసేజ్ ఎడిట్ ఫీచర్ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది.
ఈ నిర్ణయం లక్షలాది మంది వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, విధించిన ఆంక్షలు అవసరానికి మించినవని టెలిగ్రామ్ తన పిటిషన్లో వాదించింది.
Telegram సేవల నిలిపివేతపై విచారణ:
అయితే, పరీక్షలకు సంబంధించిన మోసాల్లో టెలిగ్రామ్ పదేపదే దుర్వినియోగం అవుతోందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో సమాచార సాంకేతిక చట్టంలోని బ్లాకింగ్ అధికారాలను వినియోగించడం తప్ప మరో మార్గం లేకపోయిందని పేర్కొంది.
నీట్ ప్రశ్నాపత్రాల పేరుతో విక్రయాలు, పరీక్షలకు సంబంధించిన మోసాల్లో పాల్గొంటున్నాయని అనుమానిస్తున్న పలు Telegram ఛానళ్లు, గ్రూపులు, బాట్లను NTA గుర్తించిందని కేంద్రం తెలిపింది.
ఈ ఛానళ్లు, గ్రూపులు, బాట్లకు కలిపి సుమారు 1.46 లక్షల ఖాతాల వరకు చేరుకునే సామర్థ్యం ఉందని, ప్రశ్నాపత్రాలు అందిస్తామని అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు బహిరంగంగా ప్రయత్నించాయని ఆరోపించింది.
ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలపై అత్యవసర ఉపశమనం కోరుతూ టెలిగ్రామ్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు విచారణకు వచ్చింది.



