కీలక పత్రాలు బహిర్గతం కాలేదనే విమర్శలు,
రుణం, ఆస్తుల విలువ, ఒప్పంద వివరాలపై ప్రతిపక్షాల ప్రశ్నలు..
హైదరాబాద్: Metro రైల్ ఫేజ్-1ను Larsen & Toubro (L&T) నుంచి తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియపై ప్రభుత్వం, కేంద్రం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.అయితే, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద మౌలిక సదుపాయాల లావాదేవీల్లో ఒకటైన ఈ ఒప్పందం ఎందుకు పూర్తిగా గోప్యంగా కొనసాగుతోందన్న ప్రశ్నలు కొనసాగుతున్నాయి.
ఈ టేకోవర్ మొత్తం విలువ దాదాపు రూ.15,000 కోట్లుగా అంచనా. ఇందులో సుమారు రూ.13,600 కోట్ల రుణాన్ని ప్రభుత్వం స్వీకరించి, దానికి రీఫైనాన్సింగ్ చేయాల్సి ఉంది.
అలాగే ఈక్విటీ సెటిల్మెంట్ విలువ సుమారు రూ.1,461 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.
ఈ కొనుగోలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత అసెంబ్లీ కూడా తీర్మానం ద్వారా ఆమోదించింది.
అయినప్పటికీ, పూర్తి Share Purchase Agreement (SPA), డ్యూ డిలిజెన్స్ నివేదికలు, ఆస్తుల విలువ ఎలా నిర్ణయించారు, రుణ పునర్వ్యవస్థీకరణ ఒప్పందాలు, రుణదాతలతో కుదిరిన అగ్రిమెంట్లు, బాధ్యతల బదిలీ, ఇండెమ్నిటీ క్లాజులు వంటి కీలక పత్రాలను ప్రభుత్వం ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు.
రూ.13,600 కోట్ల IRFC రీఫైనాన్సింగ్ రుణం చుట్టూ కూడా వివాదం కొనసాగుతోంది. అన్ని షరతులు పూర్తి చేసినప్పటికీ కేంద్రం నిధుల విడుదల ఆలస్యం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Metro టేకోవర్ విలువ నిర్ణయంపైనా ప్రశ్నలు వస్తున్నాయి. తొలుత ప్రభుత్వం ఈ ఒప్పందంలో సుమారు రూ.13,000 కోట్ల రుణం, రూ.2,000 కోట్ల ఈక్విటీ ఉంటుందని తెలిపింది. కానీ చివరకు ఈక్విటీ సెటిల్మెంట్ సుమారు రూ.1,461 కోట్లకు చేరిందని సమాచారం.
మెట్రో విస్తరణకు ఈ టేకోవర్ వ్యూహాత్మకంగా అవసరమని అధికార కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఒప్పందంలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తోంది.



