యాదాద్రి-భువనగిరిలో AIIMS, ICMR విజయవంతమైన ప్రయోగం
డ్రోన్ రవాణాతో పరీక్షల ఫలితాల సమయం 15 రోజుల నుంచి 5 రోజులకు తగ్గింది
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీని ఆరోగ్య సేవలతో అనుసంధానిస్తే రోగులకు వైద్యపరంగానే కాక ఆర్థికంగానూ భారీ ప్రయోజనాలు లభిస్తాయని బీబీనగర్ AIIMS మరియు ICMR పరిశోధకులు నిరూపించారు.
యాదాద్రి-భువనగిరి జిల్లాలో ICMR i-DRONE కార్యక్రమం కింద ఏడాది పాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ ఫలితాలు వెలుగుచూశాయి.
ఈ పరిశోధన 2026లో International Journal of Tuberculosis and Lung Disease Open and Digital Health జర్నల్లో ప్రచురితమైంది.
అధ్యయనంలో రోగులు చికిత్స ప్రారంభించే ముందు స్వయంగా భరించిన సగటు వైద్య ఖర్చు (Out-of-Pocket Expenditure) రూ.9,451 నుంచి కేవలం రూ.90.90కు పడిపోయినట్లు వెల్లడైంది.
ఈ పరిశోధనలో మొత్తం 840 మందిని పరిశీలించారు. సాధారణ భూ రవాణా విధానంలో 206 మంది, డ్రోన్ ఆధారిత రవాణా అమలైన తర్వాత 634 మంది వివరాలను విశ్లేషించారు.
ఇంతకుముందు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే క్షయవ్యాధి (TB) లక్షణాలున్న రోగుల కఫ నమూనాలను జిల్లా TB ఆసుపత్రులకు మాన్యువల్ రవాణా ద్వారా పంపేవారు.
రోడ్లు సరిగా లేకపోవడం, వాహనాల కొరత, ప్రయాణంలో నమూనాలు దెబ్బతినడం వంటి కారణాలతో పరీక్షల ప్రక్రియ ఆలస్యమయ్యేది.
డ్రోన్ విధానంలో గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఆరోగ్య కార్యకర్త కఫ నమూనాను సేకరిస్తారు.
కేంద్ర హబ్ నుంచి బయలుదేరిన డ్రోన్ ఆ నమూనాను తీసుకుని నేరుగా జిల్లా నిర్ధారణ కేంద్రానికి కొన్ని నిమిషాల్లో చేరవేస్తుంది.తిరుగు ప్రయాణంలో TB చికిత్సకు అవసరమైన మందులను గ్రామానికే తీసుకొస్తుంది.
ఈ విధానం వల్ల నమూనా ఇచ్చినప్పటి నుంచి పరీక్ష ఫలితం వచ్చి చికిత్స ప్రారంభించే వరకు పట్టే మధ్యస్థ సమయం 15 రోజుల నుంచి కేవలం 5 రోజులకు తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు.



