భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రయాణం
జూలై 2 నుంచి ఇప్పటివరకు 1.73 లక్షలకు పైగా భక్తులు అమర్నాథ్ దర్శనం
Amarnath : జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి Amarnath Yatra కు మరో 8,796 మంది భక్తులు శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య బయలుదేరారు. ఈ బృందంలో 33 మంది విదేశీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.
జమ్మూ–కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న అమర్నాథ్ పవిత్ర గుహకు ఈ ఏడాది యాత్ర జూలై 2న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న గుహలో సహజంగా ఏర్పడిన మంచు శివలింగాన్ని 1.73 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం బయలుదేరిన భక్తుల్లో 6,046 మంది పురుషులు, 2,042 మంది మహిళలు, 228 మంది సాధువులు, 56 మంది సాధ్వీలు, 10 మంది చిన్నారులు, ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి, 33 మంది విదేశీయులు ఉన్నారు. వీరంతా 354 వాహనాల్లో ప్రయాణం ప్రారంభించారు.
అధికారుల వివరాల ప్రకారం, యాత్రికులను రెండు వేర్వేరు కాన్వాయ్లుగా పంపించారు. బాల్తాల్ మార్గం ద్వారా 3,450 మంది భక్తులతో కూడిన కాన్వాయ్ ఉదయం 3:35 గంటలకు బయలుదేరింది. పహల్గామ్ మార్గం ద్వారా 5,346 మంది భక్తులతో మరో కాన్వాయ్ ఉదయం 4 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. ఈ సందర్భంగా భక్తులు “బమ్ బమ్ భోలే”, “హర్ హర్ మహాదేవ్”, “జై బర్ఫానీ బాబా కీ” అంటూ నినాదాలు చేశారు.
జూలై 2 నుంచి ఇప్పటివరకు జమ్మూ బేస్ క్యాంప్ నుంచి మొత్తం 61,612 మంది భక్తులు కశ్మీర్కు అమర్నాథ్ యాత్ర కోసం బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 57 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర ఆగస్టు 28తో ముగియనుంది.



