2002 అల్లర్ల నుంచి సుప్రీం కోర్టు తీర్పు వరకు.. బిల్కిస్ బానో న్యాయ పోరాటం
పార్లమెంట్లో ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలు, బయట రాహుల్ గాంధీ ఇచ్చిన కామెంట్లతో బిల్కిస్ బానో వ్యవహారం మళ్లీ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషీని ఉద్దేశించి పార్లమెంట్లో బిల్కిస్ బానో దోషుల విడుదల వ్యవహారాన్ని ప్రియాంక ప్రస్తావించడమే ఈ రాజకీయ వేడికి కారణమైంది. అసలు ఎవరీ బిల్కిస్ బానో? ఇప్పడు తన ప్రస్తావన రావడానికి కారణం ఏంటి.?
2002లో గుజరాత్లో జరిగిన దారుణమైన మత అల్లర్లు. గోధ్రా రైలు ఘోరం తర్వాత గుజరాత్ అట్టుడికిపోతున్న సమయంలో, దాహోద్ జిల్లా రంధీక్పూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల బిల్కిస్ బానో తన కుటుంబంతో కలిసి ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోతోంది. అప్పటికి ఆమె ఐదు నెలల గర్భిణి. ఆ సమయంలో ఒక మూక ఆమెపై దాడి చేసి, ఆమె కళ్లముందే 3 ఏళ్ల పసిపాపతో సహా కుటుంబానికి చెందిన 14 మందిని నరికి చంపేసింది. అంతేకాకుండా గర్భిణి అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడింది. దాడి అనంతరం ఆమె చనిపోయిందనే భ్రమలో ఆ గుంపు అక్కడి నుంచి వెళ్లిపోగా, అదృష్టవశాత్తూ స్ప్రహలోకి వచ్చిన బిల్కిస్ బానో ప్రాణాలతో బయటపడింది. ఈ భయానక ఘటన తర్వాత న్యాయం కోసం బిల్కిస్ చేసిన పోరాటం సుదీర్ఘమైంది.
సుప్రీం కోర్టు సంచలన తీర్పు:
ప్రారంభంలో గుజరాత్ పోలీసులు కేసును సరిగ్గా దర్యాప్తు చేయకపోవడం, పైగా బెదిరింపులు ఎదురవ్వడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసు తీవ్రతను గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తును సి.బి.ఐకి అప్పగించడమే కాకుండా, గుజరాత్లో విచారణ జరిగితే బాధితురాలికి న్యాయం జరగదనే ఉద్దేశంతో కేసును మహారాష్ట్రలోని ముంబై ప్రత్యేక సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. సమగ్ర విచారణ జరిపిన ముంబై కోర్టు 2008లో 11 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2017లో బొంబాయి హైకోర్టు కూడా ఆ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత 2019లో సుప్రీం కోర్టు చారిత్రాత్మక ఆదేశాలు ఇస్తూ గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానోకు రూ 50 లక్షల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు కేటాయించాలని స్పష్టం చేసింది.
కేసు ఇక్కడితో ముగిసిపోలేదు. 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. జైలులో 14 ఏళ్ల శిక్ష పూర్తయిందని, వారి ప్రవర్తన బాగుందనే సాకుతో ముందస్తు విడుదల విధానం కింద ఆ 11 మంది దోషులను జైలు నుంచి బయటకు పంపించింది. దోషులు బయటకు వచ్చినప్పుడు కొందరు వారికి పూలదండలు వేసి వేడుక చేసుకోవడం, అప్పట్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషీ ఇది చట్టపరమైన నిబంధనల ప్రకారమే జరిగింది అని వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ విడుదలను సవాలు చేస్తూ బిల్కిస్ బానో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా, 2024 జనవరి 8న అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన విడుదల ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేస్తూ, దోషులను విచారించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే విడుదల చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది. గుజరాత్ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని తీవ్రంగా తప్పుబడుతూ, విడుదలైన 11 మందిని వెంటనే మళ్లీ జైలులో లొంగిపోవాలని ఆదేశించడంతో వారంతా తిరిగి జైలుకెళ్లారు.
పార్లమెంట్లో మళ్లీ ఎందుకు ప్రస్తావన?
ప్రస్తుతం పేపర్ లీకేజీ సవరణ బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా… గర్భవతిపై అత్యాచారం చేసిన దోషుల విడుదలకు మద్దతుగా మాట్లాడిన వ్యక్తిని దేశానికి విద్యాశాఖ మంత్రిగా ఎలా నియమిస్తారని ప్రియాంకా గాంధీ పార్లమెంట్లో ప్రహ్లాద్ జోషీపై విమర్శలు గుప్పించారు. దీనిపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని పట్టుబట్టగా, బయట రాహుల్ గాంధీ కూడా ప్రియాంక వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడారు. ఈ పరిణామాలతోనే బిల్కిస్ బానో దారుణ కాండ, ఆమె సాగించిన పోరాటం దేశంలో మరోసారి హాట్ టాపిక్గా మారాయి.



