బాల కార్మికులు, యాచకులు, చెత్త ఏరుకునే పిల్లలపై ప్రత్యేక దృష్టి
డార్పన్ యాప్లో వివరాలు నమోదు.. పునరావాసం, పర్యవేక్షణకు చర్యలు
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన Operation Muskaan-XII లో 664 మంది పిల్లలను రక్షించారు. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు కమిషనరేట్ పరిధిలో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగింది. తప్పిపోయిన పిల్లలను గుర్తించడంతో పాటు బాల కార్మికులు, యాచకులు, చెత్త ఏరుకునే పిల్లలు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మైనర్లను రక్షించడం ఈ ఆపరేషన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏడు ప్రత్యేక బృందాలతో తనిఖీలు
ఆపరేషన్ కోసం సైబరాబాద్ పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక సబ్-ఇన్స్పెక్టర్, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు, ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు.
ఈ బృందాలు పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు, దుకాణాలు, నిర్మాణ ప్రదేశాలు, ఇతర సంస్థల్లో తనిఖీలు నిర్వహించాయి. అక్కడ బాల కార్మికులుగా పనిచేస్తున్న పిల్లలను గుర్తించి రక్షించారు. అలాగే యాచకులుగా ఉన్న పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
DARPAN యాప్లో వివరాల నమోదు
రక్షించిన పిల్లలందరి వివరాలను DARPAN (Digital Analysis for Reunification and Protection of At-Risk Children) యాప్లో నమోదు చేశారు. పిల్లల పునరావాసం, తదుపరి పర్యవేక్షణ కోసం ఈ వివరాలను ఉపయోగించనున్నారు.
తెలంగాణకు చెందిన 162 మంది పిల్లలు
రక్షించిన 664 మంది పిల్లల్లో 644 మంది బాలురు, 20 మంది బాలికలు ఉన్నారు. తెలంగాణకు చెందిన వారు 162 మంది కాగా.. వారిలో 159 మంది బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు 502 మంది ఉన్నారు. వీరిలో 485 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు.



