PIMS ఆసుపత్రిలో విషాదం
Islamabad : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం (ఆగస్టు 26) ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు మృతి చెందినట్లు రాయిటర్స్ పేర్కొంది.
స్థానిక ప్రసార సంస్థ జియో టీవీ కథనం ప్రకారం.. ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డులో ఉన్న నర్సరీలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నర్సరీలో 16 మంది నవజాత శిశువులు ఉన్నారు. వారిలో ఒక్కరిని మాత్రమే సురక్షితంగా రక్షించగలిగారు.
ఏసీ వ్యవస్థలో లోపమే కారణమా?:
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏసీ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు ఆసుపత్రికి చేరుకున్నాయి. ఆరు ఫైర్ ఇంజిన్లు, నాలుగు అంబులెన్సులతో సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఘటనా స్థలంలో కూలింగ్ చర్యలు కొనసాగించారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు:
ఆసుపత్రిలోని ఎంసీహెచ్ వార్డులో మూడో అంతస్తులో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. పలువురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం అదనపు డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదానికి కారణాలు, భద్రతా లోపాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై కమిటీ విచారణ చేయనుంది.



