భారత్కు పొంచిన ‘వాటర్ బాంబ్’ ముప్పు?
నేపాల్ను ఒక్కసారిగా ముంచెత్తిన వరదలు భారత్లోనూ ఆందోళన పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న భారీ మెడోగ్ డ్యామ్పై నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అరుణాచల్ప్రదేశ్కు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై చైనా ఈ ప్రాజెక్టును చేపడుతోంది.
60 వేల మెగావాట్ల భారీ ప్రాజెక్టు
చైనా నిర్మిస్తున్న మెడోగ్ డ్యామ్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా నిలవనుంది.
దీనికి సుమారు 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది.
బ్రహ్మపుత్రగా మారే యార్లుంగ్ త్సాంగ్పో నది భారీ మలుపు తిరిగే ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
మెడోగ్ డ్యామ్ను 2033 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని చైనా భావిస్తోంది.
భారత్కు ఎందుకు ముప్పు?
యార్లుంగ్ త్సాంగ్పో నదిపైనే చైనా ఈ భారీ డ్యామ్ను నిర్మిస్తోంది.
ఈ నది అరుణాచల్ప్రదేశ్లో సియాంగ్గా మారుతుంది. ఆ తర్వాత అసోంలో బ్రహ్మపుత్రగా ప్రవహిస్తుంది.
భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఇంత భారీ డ్యామ్ను నిర్మించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చైనా భూవిజ్ఞాన శాస్త్రవేత్తల అధ్యయనంలోనూ డ్యామ్ ప్రాంతం కింద యాక్టివ్ ఫాల్ట్ ఉన్నట్లు వెల్లడైంది.
‘వాటర్ బాంబ్’గా నిపుణుల హెచ్చరిక
మెడోగ్ డ్యామ్ పూర్తయితే యార్లుంగ్ త్సాంగ్పో నది నీటి ప్రవాహంపై చైనాకు గణనీయమైన నియంత్రణ లభించే అవకాశం ఉంది.
భారీ వర్షాలు కురిసే సమయంలో ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అరుణాచల్ప్రదేశ్, అసోంపై వరద ముప్పు మరింత పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డ్యామ్ నిర్మాణంతో భారత్లోని ఈశాన్య ప్రాంతానికి పెద్ద ముప్పు పొంచి ఉందని మాజీ రాయబారి రాజీవ్ డోగ్రాతో పాటు పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సియాంగ్పై భారత్ భారీ ప్రాజెక్టు
ఈ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ కూడా సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల భారీ ప్రాజెక్టును చేపడుతోంది.
ఈ ప్రాజెక్టు నీటి ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు వరద ముప్పును కొంతమేర తగ్గించేందుకు ఉపయోగపడొచ్చు.



