భర్త మరణం తర్వాత కుటుంబ బాధ్యతంతా ఆమెపైనే
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల రమాబాయ్ రణ్వీర్ తన అంకితభావంతో అందరినీ అబ్బురపరిచారు.
భర్త మరణం తర్వాత ఇద్దరు కుమార్తెలను చదివించేందుకు ఆమె చేస్తున్న కష్టం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చీరకట్టులో, చెప్పులు లేకుండా మారథాన్లో పరుగెత్తి ఆమె ప్రథమ స్థానంలో నిలిచారు.
కుటుంబం కోసం వంటమనిషిగా..
అంబజోగైకి చెందిన రమాబాయ్ రణ్వీర్ స్థానిక అకాడమీలో వంటమనిషిగా పనిచేస్తున్నారు.
ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించారు. దీంతో ఇద్దరు కుమార్తెల బాధ్యత పూర్తిగా ఆమెపైనే పడింది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూతుళ్లను ఉన్నత చదువులు చదివించాలనే పట్టుదలతో ఆమె ముందుకు సాగుతున్నారు.
కూతుళ్ల చదువుకు ఆర్థికంగా సహకరించేందుకు రమాబాయ్ అంబజోగైలోని ఓ అకాడమీలో వంటమనిషిగా చేరారు.
తన పెద్ద కూతురు పూజను కూడా అదే అకాడమీలో చేర్పించారు. అక్కడ విద్యార్థులకు వంట చేస్తూనే.. కూతుళ్ల చదువును దగ్గరుండి చూసుకుంటున్నారు.
చీరలోనే మారథాన్ బరిలోకి..
స్థానిక సంస్థ ఆధ్వర్యంలో ‘అమృత్ దౌడ్’ పేరుతో మారథాన్ నిర్వహించారు.
ఈ పోటీలో విజేతకు రూ. 3,000 నగదు బహుమతి ప్రకటించారు. దీంతో రమాబాయ్ కూడా పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
ట్రాక్ సూట్లు ధరించిన యువతుల మధ్య రమాబాయ్ సాధారణ చీరకట్టులోనే బరిలోకి దిగారు.
పోటీ మొదలైన కొద్దిసేపటికే ఆమె వేసుకున్న చెప్పులు జారిపోవడంతో వాటిని చేతిలో పట్టుకున్నారు.
ఆ తర్వాత చెప్పులు లేకుండానే ఒట్టి కాళ్లతో పరుగెత్తారు.
రాళ్లను సైతం లెక్కచేయకుండా, చీరను సర్దుకుంటూ ఆమె వేగంగా పరుగులు తీశారు.
ఒక్కొక్కరిని వెనక్కి నెడుతూ చివరకు లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రథమ స్థానంలో నిలిచారు.
ఆమె పట్టుదలను చూసిన ప్రేక్షకులు కేరింతలు కొడుతూ అభినందించారు.
తల్లి బాటలో కూతురు కూడా..
ఈ మారథాన్లో రమాబాయ్ కూతురు పూజ కూడా పాల్గొన్నారు. ఆమె ద్వితీయ స్థానంలో నిలిచారు.
ప్రస్తుతం పూజ పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్నారు. మరో కూతురు బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
విజయం తర్వాత రమాబాయ్ మాట్లాడుతూ.. తన కళ్ల ముందు కూతుళ్ల భవిష్యత్తు మెదులుతూనే ఉందని చెప్పారు.
మారథాన్లో గెలిచిన బహుమతిగా వచ్చే రూ. 3,000తో కూతుళ్ల చదువుకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేస్తానని తెలిపారు.
కష్టాలను లెక్కచేయకుండా కూతుళ్ల భవిష్యత్తు కోసం రమాబాయ్ చేస్తున్న శ్రమకు పూజ గర్వపడుతోంది.
ఈ పరుగు కేవలం ఓ మారథాన్ విజయం మాత్రమే కాదు.. తన పిల్లల భవిష్యత్తు కోసం ఓ తల్లి చేసిన పోరాటానికి ప్రతీకగా నిలిచింది.



