ఆహార సంక్షోభం మరింత తీవ్రం
పాకిస్థాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల ఆహారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో కుటుంబాల బడ్జెట్లు తలకిందులయ్యాయి.
దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు.
కనీసం పాలు, మాంసం, గోధుమలు వంటి ప్రాథమిక ఆహార పదార్థాలను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.
పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) డేటాను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. గడిచిన ఆరేళ్లలో దేశవ్యాప్తంగా ప్రధాన ఆహార పదార్థాల వినియోగం గణనీయంగా తగ్గింది.
ఆహార అభద్రత రెట్టింపు
గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పాలు, మాంసం, గోధుమలు, బియ్యం, టీ పొడి వంటి ఆహార పదార్థాల కొనుగోళ్లను ప్రజలు తగ్గించారు.
2018-19లో దేశంలో ఆహార అభద్రత 15.92 శాతంగా ఉండగా.. 2024-25 నాటికి అది 24.35 శాతానికి చేరింది.
అదే సమయంలో తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య కూడా 2.37 శాతం నుంచి 5.04 శాతానికి పెరిగింది. అంటే ఈ సంఖ్య ఆరేళ్లలో రెట్టింపైంది.
పాలు, మాంసం వంటి పౌష్టికాహారం అందించే ఖరీదైన పదార్థాలను కొనుగోలు చేసే స్థోమత లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వనస్పతి గీ వినియోగం 81 శాతం పెరుగుదల
మిగతా ఆహార పదార్థాల వినియోగం తగ్గుతుండగా.. వనస్పతి గీ వినియోగం మాత్రం భారీగా పెరిగింది.
నెలకు సగటున 690 గ్రాములుగా ఉన్న వనస్పతి గీ వినియోగం 81 శాతం పెరిగి 1.25 కిలోగ్రాములకు చేరింది.
ఖరీదైన మాంసకృత్తులు, ఇతర పౌష్టికాహార పదార్థాలకు బదులుగా తక్కువ ధరలో ఎక్కువ క్యాలరీలు అందించే వనస్పతి గీని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
పట్టణాల్లోనూ పెరుగుతున్న ఆహార కష్టాలు
వ్యవసాయ ఆధారిత దేశంగా ఉన్న పాకిస్థాన్ 2021 నుంచి ఆహార పదార్థాల నికర దిగుమతిదారుగా మారింది.
మార్కెట్లలో ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని కొనుగోలు చేసే సామర్థ్యం లేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నాయి.
మార్కెట్లో ఆహారం అందుబాటులో ఉండటం ఒకటైతే.. దాన్ని కొనుగోలు చేసి పౌష్టికాహారం తీసుకోగలగడం మరో విషయమని పాకిస్థాన్ పరిస్థితి స్పష్టం చేస్తోంది.
ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



