విచారణను ఇకపై ఎదుర్కోనని ప్రకటన
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) చీఫ్, టెరర్ ఫండింగ్ కేసులో దోషిగా తేలిన యాసిన్ మాలిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కశ్మీరీ పండిట్ నర్స్ సర్లా భట్ హత్య కేసులో ఇకపై విచారణను ఎదుర్కోబోనని ప్రకటించారు. తనకు మరణశిక్ష విధించాలని కోర్టును కోరారు.
అదే సమయంలో పాకిస్థాన్కు చెందిన తన భార్యతో వివాహ బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నట్లు కూడా వెల్లడించారు.
25 పేజీల అఫిడవిట్లో కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి ఆగస్టు 27న 25 పేజీల అఫిడవిట్ను శ్రీనగర్లోని TADA/POTA కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ముందు యాసిన్ మాలిక్ దాఖలు చేశారు.
దీనిని కోర్టు ముందు తన చివరి ప్రకటనగా ఆయన పేర్కొన్నారు.
ఇస్తిఖారా ప్రార్థన చేసిన తర్వాత తన పరిస్థితులపై ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఫిడవిట్లో తెలిపారు.
అయితే విచారణను ఇకపై ఎదుర్కోకూడదన్న తన నిర్ణయాన్ని నేరాన్ని అంగీకరించినట్లు లేదా ప్రాసిక్యూషన్ ఆరోపణలను ఒప్పుకున్నట్లు భావించకూడదని స్పష్టం చేశారు.
అయినప్పటికీ తనకు “capital punishment” విధించాలని కోర్టును కోరారు.
సర్లా భట్ కేసులో 737 పేజీల ఛార్జ్షీట్
ఈ పరిణామం సర్లా భట్ హత్య కేసులో జమ్మూ కశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) 737 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన రెండు నెలల తర్వాత జరిగింది.
యాసిన్ మాలిక్ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఉన్న కేసు వివరాల ప్రకారం.. 1990లో జరిగిన సర్లా భట్ హత్యకు సంబంధించి SIA 2026 జూన్ 29న ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో యాసిన్ మాలిక్ను కూడా నిందితుల్లో ఒకరిగా పేర్కొంది.
మూడు దశాబ్దాలకు పైగా కాలం తర్వాత ఈ కేసులో ఆయన పేరు నిందితుడిగా చేరింది.
తిహార్ జైలులో SIA అధికారులు విచారణ
కేసుకు సంబంధించి జూన్ 2, 3 తేదీల్లో SIA అధికారులు తిహార్ జైలులో యాసిన్ మాలిక్ను ప్రశ్నించారు.
హత్య జరిగిన ప్రదేశం నుంచి లభించిందని చెప్పబడుతున్న JKLF చేతిరాత నోట్పై అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
అలాగే సర్లా భట్ హత్యకు యాసిన్ మాలిక్ ఆదేశాలు ఇచ్చారన్న ప్రాసిక్యూషన్ ఆరోపణపైనా అధికారులు ప్రశ్నించినట్లు తెలిపారు.



