- రష్యా పోలీసుల అదుపులో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంజినీర్ చందన్ గుప్తా
- భర్తను రష్యన్ ఆర్మీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని భార్య స్నేహ ఆరోపణ
- మద్యం సేవించి గొడవపడ్డారనే ఆరోపణలతో అరెస్ట్ చేశామని రష్యా పోలీసులు వెల్లడి
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఇంజినీర్ చందన్ గుప్తాను రష్యా పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.
మాస్కోలో నివసిస్తున్న చందన్ గుప్తా.. నోయిడాకు చెందిన ఫ్లెక్స్ ఫిల్మ్స్ అనుబంధ సంస్థ ‘ఫ్లెక్స్ ఫిల్మ్స్ రస్ ఎల్ఎల్సీ’లో పనిచేస్తున్నారు.
‘హైలీ క్వాలిఫైడ్ స్పెషలిస్ట్’ వీసాపై ఆయన తన భార్య స్నేహ గుప్తా, 10 ఏళ్ల కుమారుడితో కలిసి మాస్కోలో ఉంటున్నారు.
ఇటీవల చందన్ గుప్తాను మాస్కో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన భార్య స్నేహ గుప్తా సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ వీడియోను విడుదల చేశారు.
తన భర్తను రష్యన్ సైన్యంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ వీడియో వైరల్ కావడంతో భారత రాయబార కార్యాలయం స్పందించింది.
భర్తను ఆర్మీలో చేర్చాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణ
రష్యా సైన్యంలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు విదేశీయులను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారని స్నేహ గుప్తా ఆరోపించారు. అందులో భాగంగానే తన భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
చందన్ గుప్తాను ఉక్రెయిన్తో యుద్ధం చేసేందుకు రష్యన్ సైన్యంలో చేరాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
తమ కుటుంబ భద్రత దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. తన భర్తను సురక్షితంగా విడిపించి భారత్కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
రంగంలోకి భారత రాయబార కార్యాలయం
స్నేహ గుప్తా విడుదల చేసిన వీడియో వైరల్ కావడంతో మాస్కోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.
స్నేహ గుప్తాతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
అయితే చందన్ గుప్తా అరెస్టుపై రష్యన్ పోలీసుల వాదన మరోలా ఉంది. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో మాస్కోలోని ప్రముఖ రెడ్ స్క్వేర్ ప్రాంగణంలో చందన్ గుప్తా తన స్నేహితుడు ఆశిష్తో కలిసి బహిరంగంగా మద్యం సేవించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
అదే సమయంలో సమీపంలోని ఓ అంబులెన్స్ అద్దాలను పగలగొట్టినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఆరోపణలపైనే చందన్ గుప్తా, ఆశిష్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
బామన్స్కాయ పోలీస్ స్టేషన్లో అదుపులో
చందన్ గుప్తా, ఆశిష్ ప్రస్తుతం బామన్స్కాయ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు సమాచారం.
వారి విడుదల కోసం భారత రాయబార కార్యాలయ అధికారులు దౌత్యపరమైన చర్యలను వేగవంతం చేశారు. కాన్సులర్ యాక్సెస్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు.
చందన్ గుప్తా వ్యవహారం రష్యన్ సైన్యంలో భారతీయుల నియామకాలపై కొనసాగుతున్న ఆందోళనల మధ్య వెలుగులోకి వచ్చింది.
రష్యన్ సైన్యంలో భారతీయుల నియామకాలపై ఆందోళన
ఉద్యోగాల పేరుతో భారతీయులను రష్యాకు తీసుకెళ్లి సైన్యంలో చేర్చుకున్న ఘటనలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది.
మొత్తం 227 మంది భారతీయ పౌరులు రష్యన్ సాయుధ దళాల్లో చేరినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. వీరిలో 139 మంది డిశ్చార్జ్ అయ్యారని, దురదృష్టవశాత్తు 51 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
మిగిలిన భారతీయులను కూడా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి రష్యా ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.



