ఈమెయిల్ ద్వారా బెదిరింపులు.. రంగంలోకి దిగిన పోలీసు, బాంబ్ స్క్వాడ్
తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదు
న్యూఢిల్లీ: Delhi Assembly , సర్దార్ పటేల్ విద్యాలయం (SPV), రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
ఉదయం సమయంలో ఈ బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసు, అత్యవసర స్పందన బృందాలను ఆయా ప్రాంతాలకు తరలించారు.
విస్తృతంగా భద్రతా తనిఖీలు
బెదిరింపులు వచ్చిన ప్రాంతాలను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించేందుకు యాంటీ-సాబోటేజ్ తనిఖీలు ప్రారంభించారు.
ఢిల్లీ పోలీసులతో పాటు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. సాధారణ భద్రతా ప్రోటోకాల్లో భాగంగా ప్రాంతాలను చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదు
ఇప్పటివరకు భద్రతా బృందాలు తనిఖీ చేసిన ఏ ప్రాంతంలోనూ అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాంగణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
బెదిరింపు ఈమెయిల్, దాని మూలాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీకి గతంలోనూ ఇలాంటి బాంబు బెదిరింపులు రావడంతో తాజా ఘటనతో భద్రతా ఆందోళనలు మరోసారి తెరపైకి వచ్చాయి.



