పాఠశాల విద్యార్థులలో పర్యావరణం వంటి సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు కొత్త ప్రయోగం జరిగింది. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శ్రీ విద్యారణ్య ఇంటర్ నేషనల్ స్కూల్ స్విస్ ప్రాంగణంలో చిన్నారులే మార్కెట్ ను నిర్వహించారు. పర్యావరణ హితాన్ని అభిలషిస్తూ పిల్లల చేత అనేక పర్యావరణ దాయక ఉత్పత్తులను తయారుచేయించారు. పిల్లలు గ్రూప్ లుగా ఏర్పడి, తాము తయారు చేసిన పర్యావరణ దాయక ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. విపణి పర్వ పేరుతో వినూత్నంగా పాఠశాల ప్రాంగణంలోనే మార్కెట్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులు, చుట్టుపక్కల ప్రజలను ఆహ్వానించారు.

పర్యావరణ హితం కోరుతూ పిల్లలు చేసిన చొరవను అంతా మెచ్చుకొన్నారు. బండ్లగూడ జాగీర్ పరిధిలోని స్థానికులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ మార్కెట్ ను ప్రోత్సహించారు. క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, కార్యదర్శి విశ్వేశ్వరరావు, కమిటీ సభ్యులు వెంకటస్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ క్రిష్ణ మోహన్ విద్యార్థులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల పర్యావరణం మీద, మార్కెట్ పోకడల పట్ల పిల్లల్లో అవగాహన కలుగుతుందని అభిలషించారు. సీనియర్ అధ్యాపకులు రమాదేవి, అనురాధ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఆచార్యులు, మాతాజీలు, కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమ రూపకల్పన లో పాలు పంచుకొన్నారు. ఈ కార్యక్రమంతో స్విస్ ప్రాంగణం అంతా సందడిగా మారింది.


