అరుణాచలం మీద శివాజీ రాజా ఆవేదన

December 1, 2025 6:47 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం లో కొంత కాలంగా పవిత్రత దెబ్బతింటోంది. సోషల్ మీడియా షూటింగ్ అంటూ కొంత మంది అతి ప్రవర్తన చేస్తున్నారు. దీంతో పవిత్రంగా ఉండే భక్తులకు మనస్తాపం కలుగుతోంది.

తాజాగా సీనియర్ నటుడు శివాజీ రాజా దీని మీద స్పందించారు. కొందరు తెలుగు వ్యక్తులు మరీ అతి చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రమణాశ్రమం వంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో కూడా కొందరు సెల్ఫీల కోసం అల్లరి చేస్తున్నారని శివాజీ రాజా గుర్తుచేసుకున్నారు. “ఒకసారి నేను, నటుడు రాజా రవీంద్ర వెళ్లినప్పుడు కొంతమంది ఫొటోల కోసం గట్టిగా అరుస్తుంటే, అక్కడున్న విదేశీయులు వచ్చి నిశ్శబ్దంగా ఉండాలని హెచ్చరించారు. వెంకటేశ్, ఇళయరాజా వంటి ప్రముఖులు కూడా ఎంతో ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు. కానీ కొందరి ప్రవర్తన అక్కడి పవిత్రతను దెబ్బతీస్తోంది. ఇది చూసి మనసుకు చాలా బాధగా ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే” అని ఆయన స్పష్టం చేశారు.

పాత రోజులను ఆయన గుర్తు చేసుకొన్నారు. “అరుణాచలం గురించి ఎక్కువ మందికి తెలియక ముందు నుంచే, గత 30 ఏళ్లుగా నేను నా కుటుంబంతో కలిసి వెళ్తున్నాను. మేం చాలా నిరాడంబరంగా దండం పెట్టుకుని వస్తాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల తర్వాత తెలుగు భక్తుల రద్దీ పెరిగింది. అయితే, వీరిలో 75 శాతం మంది భక్తితో వస్తుంటే, మిగతా 25 శాతం మంది మాత్రం అరుణాచలాన్ని ఒక వెకేషన్ ట్రిప్‌లా భావిస్తున్నారు. వాళ్లు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే” అని అన్నారు.

ప్రస్తుతం ఇంటర్ నెట్ లో శివాజీ రాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media