ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక వ్యక్తి తన అన్ననే అత్యంత కిరాతకంగా హత్య చేసి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పన్నిన కుట్రను కరీంనగర్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని రామడుగు పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు మామిడి నరేష్ (30), రామడుగు గ్రామం. వ్యాపారాలు, షేర్ మార్కెట్లో పెట్టుబడుల కారణంగా నరేష్కు సుమారు రూ. 1.50 కోట్ల అప్పులు అయ్యాయి.
అప్పులు తీర్చుకోవడం కోసం, నరేష్ తన అన్న, మానసిక పరిపక్వత లేని మామిడి వెంకటేష్ (37) పేరుపై ఏకంగా రూ. 4 కోట్ల 14 లక్షల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు.
స్నేహితుడు నముండ్ల రాకేశ్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్లతో కలిసి నరేష్ ఈ ప్లాన్ అమలు చేశాడు. 29-11-2025 రాత్రి, టిప్పర్కు జాకీ వేసే సాకుతో అన్న వెంకటేష్ను పిలిపించి, టిప్పర్ను స్వయంగా నడిపిన నరేష్, జాకీ తిప్పుతున్న అన్నపైకి ఎక్కించి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
నరేష్ అల్లుడు సాయి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. మృతదేహ పంచనామా, స్థల పరిశీలనలో అనుమానాలు బలపడటంతో, నిందితులను విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు.
హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్ ఫోన్, ఇన్సూరెన్స్ పాలసీల పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏ.సి.పి శ్రీ విజయ కుమార్ గారి ఆధ్వర్యంలో పనిచేసిన పోలీసు బృందాన్ని కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌష్ ఆలం అభినందించారు.
నిందితులపై సంబంధిత సెక్షన్లలో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు
