కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద సంక్రాంతి పడవ పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణలో ప్రమాదం చోటుచేసుకుంది. పడవ పోటీల ట్రయల్ రన్ను ప్రారంభించే క్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అదుపుతప్పి అకస్మాత్తుగా కాలువలో పడిపోయారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారీ స్థాయిలో పడవ పోటీల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి మరియు ట్రయల్ రన్ ప్రారంభించడానికి కలెక్టర్ శుక్రవారం ఉదయం పులిదిండి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన పడవలో నుండి అదుపుతప్పి నీటిలో పడిపోయారు.
కలెక్టర్ నీటిలో పడగానే అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు (స్విమ్మర్లు) మెరుపు వేగంతో స్పందించారు. వెంటనే ఆయన్ను నీటిలో నుండి సురక్షితంగా బయటకు తీసి మరో పడవలోకి చేర్చారు. స్విమ్మర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం కలెక్టర్ క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
