ప్రభుత్వ వసతి గృహాలు అవినీతికి నిలయాలుగా మారుతున్నాయన్న ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి బీసీ హాస్టల్లో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ సెంట్రల్ సర్కిల్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో హాస్టల్ వార్డెన్ వద్ద నుంచి రూ. 1,84,070 అక్రమ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ముకు సంబంధించి వార్డెన్ ఎటువంటి లెక్కలు చూపలేకపోయారు. వార్డెన్ విద్యార్థుల నుంచి తల ఒక్కంటికి రూ. 500 చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అవినీతికి పాల్పడిన వార్డెన్పై కేసు నమోదు చేసిన అధికారులు, అక్రమ సొమ్మును సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం జైలుకు తరలించారు. ఉన్నతాధికారులకు ఇక్కడి నుంచే మామూళ్లు వెళ్తున్నాయనే ఆరోపణలపైనా ఏసీబీ ఆరా తీస్తోంది.
