రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖపట్నం సీతమ్మధారలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హాస్టల్లో కాళ్లు, చేతుల వంకర్లతో బాధపడుతున్న ఓ విద్యార్థిని చూసి మంత్రి చలించిపోయారు. వృత్తిరీత్యా వైద్యుడైన మంత్రి, ఆ బాలుడిని అక్కున చేర్చుకుని “నేను డాక్టర్ని.. నీకు ఉచితంగా మెరుగైన వైద్యం చేయిస్తా” అని భరోసా ఇచ్చారు.వంటగది, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను మంత్రి స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. హాస్టళ్ల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో మంత్రులు సవిత, డోల బాల వీరాంజనేయ స్వామి, ఎన్ఎండీ ఫరూక్లతో సమీక్ష నిర్వహించారు.విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, నిరంతరం ఆరోగ్య పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశించారు. హాస్టళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

“ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోగలరు” అని ఈ సందర్భంగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఉద్ఘాటించారు.
