ACBవిభాగంలోనే పనిచేస్తూ, అవినీతి తిమింగలాలకు సమాచారం చేరవేస్తూ అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఓ హోంగార్డు నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గుర్ల మండలం నడుపూరులోని ఆయన అత్తవారి ఇంటితో పాటు విజయనగరం, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
నెట్టి శ్రీనివాసరావు సుమారు 15 ఏళ్లుగా హోంగార్డుగా పనిచేస్తున్నారు. గతంలో ఏసీబీ విభాగంలో పనిచేసిన సమయంలో దాడుల సమాచారాన్ని ముందుగానే లీక్ చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను విధుల నుండి తొలగించి, జిల్లా పోలీసు కార్యాలయానికి సరెండర్ చేశారు. ఒక సాధారణ హోంగార్డు స్థాయి వ్యక్తి సుమారు రూ. 20 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అక్రమంగా సంపాదించిన నగదు, డాక్యుమెంట్లను శ్రీనివాసరావు తన అత్తవారి ఇంట్లో దాచినట్లు వచ్చిన అనుమానంతో నడుపూరులో ఏసీబీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి.

విజయనగరం అలకానంద కాలనీలోని ఆయన నివాసం, ఎస్.కోట మరియు విశాఖలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సాధారణ హోంగార్డు ఇంత భారీ మొత్తంలో ఆస్తులను ఎలా సంపాదించారనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సోదాలు ముగిసేసరికి ఆస్తుల విలువ మరికొంత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
