రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం విశాఖపట్నంలో ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. భారతీయ సనాతన ధర్మం మరియు నైతిక విలువల పరిరక్షణలో చాగంటి వారు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.
తన సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట ప్రజలకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించాలని మంత్రి అనిత కోరారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉపమాక శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి విన్నపానికి సానుకూలంగా స్పందించిన చాగంటి కోటేశ్వరరావు గారు, వచ్చే ఫిబ్రవరి నెలలో పాయకరావుపేట నియోజకవర్గానికి విచ్చేస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించడం, ఆధ్యాత్మికత ద్వారా మానసిక ప్రశాంతత పొందే అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. చాగంటి వారి రాక నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక మేలు చేస్తుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
