అవినీతికి నిలయంగా మారుతున్న ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళనకు ఏసీబీ (ACB) రంగంలోకి దిగింది. తాజాగా కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ మొత్తంలో లెక్కచూపని నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఫిబ్రవరి 1 నుండి భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల తాకిడిని ఆసరాగా చేసుకుని భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ డీఎస్పీ ఎం. కిషోర్ కుమార్ నేతృత్వంలో రాత్రి 8:45 గంటలకు దాడులు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో మొత్తం రూ. 1,82,210 అక్రమ నగదును అధికారులు గుర్తించారు. ఇందులో సబ్ రిజిస్ట్రార్ చాంబర్ నుండి రూ. 79 వేలు, మిగిలిన మొత్తాన్ని ఇతర సిబ్బంది వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.కేవలం నగదు మాత్రమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రొహిబిటెడ్ (నిషేధిత) భూముల రిజిస్ట్రేషన్లు ఏవైనా జరిగాయా అనే కోణంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే భయపడకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 94404 46160 కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
