విశేషమైన ఆరుద్ర నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్ల స్వర్ణరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆది దంపతులు స్వర్ణరథంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఆరుద్రోత్సవం సందర్భంగా వేకువజామునే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం మరియు ప్రత్యేక అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా, సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆలయ అర్చకులు లోకకల్యాణార్థం సంకల్పాన్ని పఠించారు. స్వర్ణరథంపై కొలువైన స్వామి-అమ్మవార్లు ఆలయ మాడవీధులలో విహరించారు. ఈ ప్రస్థానంలో కోలాటాలు, తప్పెట చిందులు, సంప్రదాయ నృత్యాలతో కళాకారులు ప్రదర్శనలు ఇచ్చి భక్తులను అలరించారు. ఈ వేడుకలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రమేష్ నాయుడు, ఈఓ ఎం. శ్రీనివాసరావు మరియు ఇతర బోర్డు సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
