“రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు ఎంత అవసరమో.. ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్రను కాలుష్య నిలయంగా మార్చవద్దు” అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఆధ్వర్యంలో పారిశ్రామిక యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

పరవాడ పారిశ్రామికవాడలోని తాడి గ్రామంలో ఇంటికొకరు క్యాన్సర్ బారిన పడుతుండటం, మహిళల్లో గర్భస్రావాలు అవ్వడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు వెదజల్లే విషవాయువులే దీనికి కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పరిశ్రమ తన పరిధిలో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను మొక్కుబడిగా కాకుండా, జీవ వైవిధ్యం పెంపొందేలా అమలు చేయాలని ఆదేశించారు. ఏపీలోని 970 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘గ్రేట్ గ్రీన్ వాల్’ నిర్మాణంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ఆధునిక సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ మరియు గాలి నాణ్యత పెంపునకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు కేవలం లాభాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా, సాటి మనుషుల ఆరోగ్యం పట్ల కనీస బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

