“గ్రామం చిన్నదైనా సమస్య పెద్దది.. అందుకే రక్షణ గోడ మంజూరు ఆర్డర్తోనే మీ ముందుకు వచ్చాను” అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. యస్.రాయవరం మండలం సోముదేవుపల్లి గ్రామంలో శనివారం ఆమె పర్యటించి, వరహానది రక్షణ గోడ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.

వరదల సమయంలో సోముదేవుపల్లి గ్రామం ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ. 10 కోట్లతో వరహానది రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి నిధులు మంజూరు చేయించారు. పర్యటనలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో త్వరలోనే నూకాలమ్మ తల్లి ఆలయాన్ని నిర్మిస్తామని, తాగునీటి సమస్యను ఇప్పటికే పరిష్కరించామని మంత్రి హామీ ఇచ్చారు. నిధుల మంజూరుకు సహకరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సమస్య ఏదైనా తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

