“పేదలు ధనికులుగా ఎదగాలి.. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి” అన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా పీ4 (P4 – Public Private People Partnership) పథకం మరియు ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ ప్రెన్యూర్’ లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

కుప్పం నియోజకవర్గంలోని పేద కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా మార్చేందుకు మెఘా ఇంజనీరింగ్, అదానీ, టీవీఎస్ వంటి సంస్థలు దత్తత తీసుకున్నాయి. ప్రతి 100 కుటుంబాలకు ఒక ‘బంగారు మిత్ర’ను నియమించి ఆదాయం పెంచేలా శిక్షణ ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఈలు (MSME) స్థాపించేందుకు బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని సీఎం ఆదేశించారు. ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్పై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఏడాది నుంచే ‘సంజీవని’ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి ₹2.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు. పశువుల కోసం ‘ఆధార్’ మాదిరిగా రూపొందించిన ‘గోధార్’ పురోగతిని సమీక్షించారు. పాడి రైతులకు తక్కువ ధరకే దాణా అందించాలని అధికారులను ఆదేశించారు. కుప్పంలో ఏర్పాటు కాబోయే పరిశ్రమల ద్వారా 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం ఉండదని సీఎం భరోసా ఇచ్చారు.

