జూదరుల ఆటకట్టించేందుకు పోలీసులు ‘డ్రోన్’ అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లూరు గ్రామం వద్ద కంప చెట్ల చాటున గుట్టుగా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు డ్రోన్ సాయంతో మెరుపు దాడి చేశారు.

కల్లూరు తూర్పు వైపున గల పొదల్లో జూదం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, రూరల్ సీఐ ఎం. నాగభూషణ్ పర్యవేక్షణలో ఎస్ఐ శ్రీకాంత్ బృందం రంగంలోకి దిగింది. నిందితులు తప్పించుకోకుండా డ్రోన్ కెమెరాతో గాలింపు చేపట్టి వారిని గుర్తించారు. పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో జూదరులు కంగుతిన్నారు. మొత్తం 11 మంది జూదం ఆడుతుండగా, ఐదుగురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 14,500/- నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో తప్పించుకున్న మరో ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని, సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం నిఘా ఉంటుందని సీఐ నాగభూషణ్ హెచ్చరించారు.
