శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ఈ ఫిబ్రవరిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం ఆయన ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
శ్రీకాకుళం నగరవాసులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కార్గిల్ పార్క్ పనులను ఈ ఫిబ్రవరి నెలలోనే పూర్తి చేసి ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.ఇండిగో (IndiGo) సంస్థ తన సీ.ఎస్.ఆర్ (CSR) నిధుల నుండి కేటాయించిన రూ. 10 కోట్లతో శ్రీకూర్మనాథ ఆలయ పరిసరాల అభివృద్ధి, పుష్కరిణి పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. చారిత్రక పొందూరు ఖాదీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా విస్తృత ప్రచారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ను కోరారు. పలాస-కాశీబుగ్గ ప్రజల దశాబ్దాల కల అయిన ఆర్ఓబీ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ లోగా పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవనాల నిర్మాణం మరియు ప్రస్తుత తరగతుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
“ప్రతి మంగళవారం జరిగే ఈ సమీక్షా సమావేశాల ఉద్దేశ్యం పనుల్లో జాప్యాన్ని నివారించడమే. నిధుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తాం” అని మంత్రి భరోసా ఇచ్చారు.
