అధికారం కోల్పోయినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచక మనస్తత్వం మారలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, వైఎస్ కుటుంబం మూడు తరాలుగా రాష్ట్రంలో అరాచక పాలనను సాగిస్తోందని ఆరోపించారు.

నాడు రాజారెడ్డి, మొన్న రాజశేఖర్ రెడ్డి, నేడు జగన్ రెడ్డి వరకు అంతా ఒకే రకమైన ‘జంగిల్ రాజ్’ను నడిపిస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా తొలగించే సంస్కృతికి వారే బీజం వేశారని అన్నారు. తాము పులివెందులలో జగన్ అరాచక పాలనకు ప్రత్యక్ష బాధితులమని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తమ ఇంటిని డైనమైట్లతో పేల్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ సిద్ధహస్తుడని, పులివెందుల మెజిస్ట్రేట్ను మేనేజ్ చేసి తమకు జీవిత ఖైదు వేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి, జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబుపై దాడులు, నారా లోకేష్ పాదయాత్రలో వేధింపులు.. ఇవన్నీ ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు.ఇన్ని దాడులు చేయించి ఇప్పుడు తాము శాంతికాముకులమని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అక్రమంగా బూతులు తిట్టడం, దాడులు చేయడం వైసీపీ నైజమని విమర్శించారు.
“రాజకీయాల్లో సిద్ధాంతపరమైన వైరం ఉండాలి కానీ, కుటుంబాలను లాగకూడదు. మహిళలను దూషించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు” అని ఆయన స్పష్టం చేశారు
