వెనుకబడ్డ వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెడతానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి పలు భూమిపూజలు నిర్వహించారు.ఎన్టీఆర్ కాలనీలోని టిడ్కో నివాసితులకు వైద్యం చేరువ చేసేందుకు రూ. కోటి వ్యయంతో నిర్మించనున్న అర్బన్ హెల్త్ సెంటర్ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.

పట్టణంలోని 9వ వార్డులో రూ. 36 లక్షల నిధులతో నిర్మించనున్న సి.సి. రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. స్థానిక విశ్వోదయ కళాశాల మైదానంలో ఓపెన్ జిమ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది యువతతో పాటు మహిళలు, వృద్ధుల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.వెంకటగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానని రామకృష్ణ భరోసా ఇచ్చారు.
