ప్రకాశం జిల్లా ఒంగోలులోని మైనింగ్ (గనుల శాఖ) కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం భారీ సోదాలు నిర్వహించారు. మైనింగ్ సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ అసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఈ దాడులు జరిగాయి.
సోదాల అనంతరం అబ్దుల్ అసిఫ్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. అసిఫ్ నివాసంతో పాటు ఆయన బంధువులు, మిత్రుల ఇళ్లలో కూడా ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. మైనింగ్ శాఖలో సర్వేయర్గా పనిచేస్తున్న అసిఫ్, తన పదవిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. సోదాల్లో భాగంగా పలు భూ పత్రాలు, నగదు మరియు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ ఘటనతో మైనింగ్ శాఖలోని ఇతర అధికారులలోనూ ఆందోళన నెలకొంది. పూర్తి నివేదికను ఏసీబీ ఉన్నతాధికారులకు అందజేయనున్నారు
