పాత ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో కొత్త ఆయుధాలు
భారత సైన్యంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న పాత ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో అధునాతన ఏకే-203 ‘షేర్’ అసాల్ట్ రైఫిళ్లను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పూర్తి భారతీయ విడిభాగాలు, ముడిసరుకుతో తయారు చేసిన తొలి ప్రోటోటైప్ రైఫిల్ పరీక్షను ఉత్తరప్రదేశ్లోని అమేఠీ కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విజయవంతంగా నిర్వహించారు.
ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్ఆర్పీఎల్) ఆధ్వర్యంలో ఈ రైఫిల్ తయారవుతోంది.
పూర్తిగా భారతీయ సాంకేతికత, స్థానికంగా తయారైన విడిభాగాలతో రైఫిల్ను రూపొందించడం ఈ ప్రాజెక్టులో కీలకమైన అంశంగా నిలిచింది.
800 మీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం
ఏకే-203 ‘షేర్’ రైఫిల్ కలాష్నికోవ్ ప్లాట్ఫామ్ ఆధారంగా పనిచేసే గ్యాస్ ఆపరేటెడ్ 7.62×39 ఎంఎం అసాల్ట్ ఆయుధం.
సుమారు 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం దీనికి ఉందని సమాచారం.
ఈ రైఫిల్ నిమిషానికి 700 రౌండ్ల వరకు ఫైరింగ్ చేయగలదు.
అధునాతన డిజైన్, తక్కువ బరువు కారణంగా కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు, సరిహద్దు భద్రతా బలగాలు దీన్ని ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
సెప్టెంబర్లో ఆర్మీ ట్రయల్స్
పూర్తి భారతీయ సాంకేతికతతో తయారు చేసిన మరిన్ని ‘షేర్’ రైఫిల్ ప్రోటోటైప్లను సెప్టెంబర్లో సైనిక ట్రయల్స్ కోసం ఆర్మీకి అప్పగించనున్నట్లు ఐఆర్ఆర్పీఎల్ సీఈఓ మేజర్ జనరల్ కేఎస్ శర్మ తెలిపారు.
ఫ్యాక్టరీలో ప్రతి 100 సెకన్లకు ఒక ఏకే-203 రైఫిల్ తయారయ్యేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు.
రాబోయే రోజుల్లో భారత సైన్యానికి 6 లక్షలకు పైగా ఏకే-203 రైఫిళ్లను అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.



