తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రతకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ డిమాండ్ చేశారు. ఆదివారం అమలాపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు నిర్వహించిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు.

జగన్ ఐదేళ్ల పాటు ‘డార్క్ రూమ్’ పాలన సాగించారని, ఇప్పటికైనా చీకటి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినా జగన్ తీరు మారలేదని, దేవుడి ప్రసాదం విషయంలోనూ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగిన జగన్ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అలిపిరి వద్ద మద్యం బాటిల్స్ పెట్టి అరాచకాలు సృష్టించిన చరిత్ర వైకాపా నేతలదని ధ్వజమెత్తారు.అంతర్వేది రథం దగ్ధం ఘటనను గుర్తు చేస్తూ జగన్ పాలనలో హిందూ ధర్మంపై జరిగిన దాడులను విమర్శించారు.వైసీపీ నాయకుల మానసిక స్థితి దిగజారుతోందని, ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని భక్తులకు క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు.
