భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వేములవలస జంక్షన్లో ఆయన విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొని పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమూల్యమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు.అయితే ప్రస్తుత ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తోందని విమర్శించారు. సమాజంలో నిజమైన సమానత్వం నెలకొల్పాలంటే ఆయన సిద్ధాంతాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
