తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. నిన్నటి నుంచి కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్టులపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసులు 67 మంది అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సత్తెనపల్లిలో 27 మంది, రాజుపాలెంలో 29 మంది, ముప్పాళ్లలో 11 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. విజయవాడ వెళ్తున్న తమను గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి తిప్పుతూ పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్యకర్తలు వాపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు.అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. సుబ్బారావమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణి ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. జీతాలు పెంచాలని, పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి కార్యక్రమానికి కొనసాగింపుగా ఈరోజు కూడా కార్యకర్తలు విజయవాడకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అరెస్టులు చేసినా డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపబోమని అంగన్వాడీ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.

