తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాపూరులోని ఐ.సీ.డీ.యస్. (ICDS) కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు భారీ నిరసన చేపట్టారు. సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఐదు రోజుల ఆందోళనలో భాగంగా రెండో రోజైన మంగళవారం కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంగన్వాడీలకు నెలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలి. మే నెలలో అంగన్వాడీ కేంద్రాలకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
