ప్రకాశం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుత అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. తనపై వ్యక్తిగత విమర్శలు ఆపకపోతే ఊరుకునేది లేదని, ఎవరి అక్రమాలు ఎంతో బయటపెడతానని హెచ్చరించారు.
అధికారంలోకి రావడం కోసం అసత్య ప్రచారాలు చేశారని, మెప్మాలో జరిగిన అవినీతికి వంద ఆధారాలు చూపిస్తానని బాలినేని సవాల్ విసిరారు. వీటిపై నిజనిర్ధారణ చేయాలని తాను సీఎం చంద్రబాబును కూడా కోరినట్లు తెలిపారు. జనార్దన్పై తాము కరపత్రాలు వేయించే స్థితిలో లేమని, చేతనైతే బహిరంగ ప్రమాణానికి రావాలని ఛాలెంజ్ చేశారు. గతంలో తాను ఎవరినీ వేధించలేదని స్పష్టం చేశారు.ఒంగోలులో పోలీస్ వ్యవస్థ ఉందా లేక రౌడీల రాజ్యం నడుస్తుందా అని ప్రశ్నించారు. కేవలం రెండు రోజులు వచ్చి వెళ్లిపోయే వ్యక్తిని కాదని, ఇకపై వారంలో రెండు రోజులు ఒంగోలులోనే ఉండి ప్రజల కోసం పోరాడుతానని ప్రకటించారు.తాను అక్రమాలను కాపాడుకోవడానికి జనసేనలోకి వెళ్లలేదని, ప్రజల అండతోనే పోరాడుతున్నానని బాలినేని పేర్కొన్నారు.తమకు పార్టీ అండ లేకపోయినా ప్రజల అండ ఉందని, అరాచకాలను అడ్డుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
