భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడులు కలకలం రేపాయి. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి భారీగా నగదు డిమాండ్ చేసిన భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) సురేష్, రూ. 4 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

బాధితుడి ఫిర్యాదుతో పక్కా వ్యూహం పన్నిన ఏసీబీ బృందం, సురేష్ నగదు తీసుకుంటున్న సమయంలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అధికారిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయన నివాసంలో మరియు కార్యాలయంలో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు సూచించారు.
