రాజధాని అమరావతిలో నిర్వహించిన ‘నీరు-ప్రగతి-జలహారతి సాగునీటి సంఘాల భాగస్వామ్యం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా సాగునీటి వినియోగదారుల సంఘాలను (WUA) మళ్లీ బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు ఉపయోగపడే అడ్వాన్స్డ్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే స్మార్ట్ అగ్రికల్చర్ మోటార్లను సీఎం స్వయంగా పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సాగునీరు వృథా కాకుండా ఉండాలంటే క్షేత్రస్థాయిలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం అత్యంత అవసరమని, గత ప్రభుత్వం విస్మరించిన ఈ వ్యవస్థలను తిరిగి గాడిలో పెడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మరియు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.సాంకేతికతను సాగునీటితో జోడించి రైతుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
