ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలిలోని బాలయోగి బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యతపై తీవ్ర లోపాలు బయటపడ్డాయి. వెంకటగిరి ఎమ్మెల్యే Kurugondla Ramakrishna ఆకస్మికంగా కళాశాలను తనిఖీ చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

డక్కిలి మండల పరిషత్ కార్యాలయంలో కార్యక్రమం అనంతరం మధ్యాహ్న భోజన సమయానికి కళాశాలను పరిశీలించిన ఎమ్మెల్యే, విద్యార్థినులకు నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 450 మంది విద్యార్థినులు ఉన్నప్పటికీ, వందమందికి సరిపడేంత మాత్రమే వంట చేయడం, పప్పు రసం లా ఉండడం, తక్కువ పరిమాణంలో కూరలు వడ్డించడం వంటి అంశాలు గుర్తించారు.ఉదయం ఇవ్వాల్సిన పాలు, గుడ్లు, స్నాక్స్ అందడం లేదని, రాత్రి మిగిలిన ఆహారాన్ని మళ్లీ వడ్డిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితిపై ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అవసరమైతే భోజన సరఫరా సంస్థను రద్దు చేసి కొత్త సంస్థను నియమిస్తామని హెచ్చరించారు.
