ఏపీలో పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులను అరికట్టడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. శాసనమండలిలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో విద్యావంతులు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా పడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో త్వరలోనే ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ప్రకటించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా భయపెడితే భయపడకుండా వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని, పోలీసులు తక్షణమే స్పందిస్తారని భరోసా ఇచ్చారు. అక్టోబర్ నెలను ‘సైబర్ భద్రత అవగాహన మాసం’గా పాటిస్తున్నామని, ఇప్పటివరకు 1596 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. సోషల్ మీడియా వ్యసనం నుండి పిల్లలను కాపాడటానికి పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఇప్పటికే ఒక జీవో జారీ చేశామని, మంత్రుల ఉపసంఘం దీనిపై నిరంతరం సమీక్షిస్తోందని స్పష్టం చేశారు.
APలో ప్రతి జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్.. హోం మంత్రి అనిత
