మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన కేవలం రాజకీయ ప్రదర్శన కోసమేనని హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. నక్కపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఘాటుగా స్పందించారు.
జగన్ తన ఇంటి నుంచి కేవలం 21 కిలోమీటర్ల దూరాన్ని ఆరు గంటల పాటు ప్రయాణించడం ప్రదర్శన యాత్ర కాక మరేమిటని ఆమె ప్రశ్నించారు. ఓదార్పు ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం పరుష పదజాలం వాడమని ఏ నాయకుడికి వెసులుబాటు ఇచ్చిందో అంబటి రాంబాబు ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంటే అడ్డుకోవడం తగదని హెచ్చరించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులను ఎవరూ మర్చిపోలేదని, అన్నీ తెలిసిన రాజకీయ నాయకులు ఇలాంటి సంఘటనలను ప్రోత్సహించడం శోచనీయమని అన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను, చట్టాన్ని విమర్శించడం మానుకోవాలని ఆమె వైసీపీ నేతలకు హితవు పలికారు.
