పట్టణ ప్రధాన రోడ్లను చెత్తమయం చేస్తున్న దాల్మియా సిమెంట్ పరిశ్రమ లారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను ఆయన పరిశీలించారు.

భారీ వాహనాలు బైపాస్ రోడ్డు ద్వారా వెళ్లాలనే నిబంధన ఉన్నప్పటికీ, దాల్మియా పరిశ్రమకు వెళ్లే చెత్త లారీలు పట్టణం మధ్యలో నుంచే వెళ్తున్నాయని శివకుమార్ మండిపడ్డారు. లారీల నుంచి చెత్త రోడ్లపై పడటంతో గాలికి చెల్లాచెదురై తీవ్ర దుర్వాసన వస్తోందని, పందులు, కుక్కల వల్ల పట్టణం అపరిశుభ్రంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కోసం కృషి చేస్తుంటే, పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం పట్టణాన్ని అపరిశుభ్రం చేస్తున్నాయని విమర్శించారు. అధికారులు స్పందించి చెత్త లారీలను పట్టణంలోనికి రాకుండా చూడాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి భారీ ఆందోళనలు చేపడతామని DYFI హెచ్చరించింది.
