విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో త్వరలో నిర్వహించ తలపెట్టిన అత్యంత పవిత్రమైన ‘మహాకుంభాభిషేక’ మహోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకను కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారి పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.
దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ శుక్రవారం కంచిలో మహాస్వామి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కుంభాభిషేక ఆహ్వాన పత్రికను అందజేసి, ఈ మహాక్రతువుకు విచ్చేసి భక్తులను అనుగ్రహించాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పీఠాధిపతులు, వేద పండితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుంభాభిషేకానికి అవసరమైన యాగశాల నిర్మాణం, ఇతర సాంప్రదాయ క్రతువుల కోసం ఆలయ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.
