నగరంలోని ఫోర్త్ టౌన్ సీఐ విక్రమ్ సింహ తీరును నిరసిస్తూ న్యాయవాదులు సోమవారం కొండారెడ్డి బురుజు వద్ద భారీ ఆందోళన చేపట్టారు. పవన్ కుమార్ అనే న్యాయవాది పట్ల సీఐ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని ఆరోపిస్తూ న్యాయవాదులు ధర్నాకు దిగారు. దీంతో నగరంలో గంటపాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

“రక్షక భట నిలయాలు రాక్షస నిలయాలుగా మారుతున్నాయి” అంటూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. న్యాయవాదులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పత్తికొండ కోర్టులో ముద్దాయిని తీసుకెళ్లడంలో పోలీసుల ఓవరాక్షన్, గతంలో ఆదోని సీఐ తీరును ఈ సందర్భంగా న్యాయవాదులు గుర్తు చేశారు. సీఐ విక్రమ్ సింహపై శాఖాపరమైన చర్యలు తీసుకుని, తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.అడిషనల్ ఎస్పీ మరియు ఇతర సీఐలు రంగంలోకి దిగి న్యాయవాదులకు భరోసా ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
