కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వినతులు స్వీకరించి, సమస్యల తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

ప్రజలు తమ సమస్యలను తప్పనిసరిగా ఫిర్యాదు రూపంలో సమర్పించాలని సూచించిన ఎమ్మెల్యే, వచ్చిన ఫిర్యాదుల స్థితిగతులను విజన్ ఆఫీసర్ వినోద్ ద్వారా సమీక్షించారు.మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డులో దారి సమస్యను పరిష్కరించాలని కోరిన మహిళల వినతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజల ఫిర్యాదులు ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా సీఎం కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాలకు చేరుతాయని, నిర్దిష్ట కాలంలో పరిష్కారం లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.ప్రజలు ప్రజాదర్బార్ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
