“రాష్ట్ర భవిత మీరే.. రాబోయే కాలంలో చరిత్ర సృష్టించేది మీరే” అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. బుధవారం అసెంబ్లీని సందర్శించేందుకు వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో అసెంబ్లీ లాబీల్లో మంత్రి లోకేష్ సరదాగా ముచ్చటించారు.

కెరీర్ కోసం ఇంగ్లీష్ అవసరమైనప్పటికీ, అమ్మలాంటి మాతృభాష తెలుగును ఎప్పటికీ మర్చిపోవద్దని లోకేష్ సూచించారు. తాను విదేశాల్లో చదువుకోవడం వల్ల మొదట్లో తెలుగు రాక ఇబ్బంది పడిన విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్, మధ్యాహ్నం భోజనం నాణ్యత, రాగిజావ పంపిణీ మరియు టీచర్లు బోధించే విధానంపై విద్యార్థుల నుంచి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న చర్చల గురించి విద్యార్థులను ప్రశ్నించి, ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి ఉన్న అవగాహనను మంత్రి మెచ్చుకున్నారు.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నేరుగా అసెంబ్లీని సందర్శించి మంత్రి లోకేష్తో ముచ్చటించడం వారిలో నూతనోత్తేజాన్ని నింపింది.

