ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం సెజ్ (SEZ)లో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా పరిశ్రమకు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం శంకుస్థాపన చేశారు.
సుమారు 102 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఈ గ్రీన్ ఫీల్డ్ ఫార్మా ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1,750 మందికి ప్రత్యక్షంగా, మరికొన్ని వందల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక్కడ మెడికల్ ఇమేజింగ్లో వాడే కాంట్రాస్ట్ మీడియా ఇంటర్మీడియట్స్, హై-ఇంటెన్సిటీ స్వీటెనర్స్ మరియు స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేయనున్నారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (ZLD) సాంకేతికతతో, 95% నీటిని రీసైకిల్ చేస్తూ పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాంట్ను తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయా కృష్ణన్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ పరిశ్రమ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
